పోతే పొండి అంటున్న జగన్..
వైసీపీ అధినేత జగన్.. సార్వత్రిక ఎన్నికల తర్వాత చాలా సైలెంటైపోయారు. పార్టీ నుంచి వలసలు కొనసాగుతుంటే.. వారిని ఒప్పించలేక సతమతమవుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. నేతలు వలసబాట పడుతున్నారు. అధికార కూటమి ద్వారం తెరిస్తే చాలు దూకేస్తామన్న సంకేతాలిస్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీ కార్యకర్తల్లో కలకలం రేపుతున్నాయి. అయితే జగన్ మాత్రం పోతే పోండి డోంట్ కేర్ అంటున్నారు.
ఈ విషయంలోనూ జగన్ .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.పోయినోళ్లు పోనీ.. పెద్దగా బాధ పడాల్సిన పనిలేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పుడు జగన్ కూడా పోతే పొండి.. ఏం నష్టం లేదంటున్నారు. చాలా మంది చెబుతా ఉన్నారు. అన్నా.. వాళ్లు వెళ్లిపోతున్నారు అని. నేనేం చేస్తాను. వెళ్లేవాళ్లను వెళ్లమనే చెబుతా. నేను ఆపితే మాత్రం ఉంటారా? ఇక్కడొక కాలు.. అక్కడొక కాలు.. ఎందుకు? వెళ్లేవాళ్లు ఎంతటి వారైనా నేను ఆపను. నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు” అని జగన్ వ్యాఖ్యానించారు.ఎందుకిలా.. ? పార్టీనేతలు బయటకు పోతుంటే.. వారిని ఆపాల్సింది పోయి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక కారణమేంటి..?
అధికారంలో ఉన్నంత సేపు.... కేసీఆర్,జగన్ పార్టీ అంటే తాము.. తామంటే పార్టీ అన్నట్లు బిహేవ్ చేశారు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు చెప్పింది వినే పరిస్థితి ఉండేది కాదు. తాము చెప్పిందే వేదమన్నట్లు నడిపించారు. అయితే అప్పుడు అధికార దండం ఉంది కాబట్టి... ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీరు చెప్పినట్లు విన్నారు. అంతేకాదు.. వీరి మెప్పు కోసం విపక్షనేతలపై అడ్డగోలుగా విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు అధికారం పోయింది. పార్టీ మరీ 11 సీట్లకే పరిమితమైంది. దీంతో ఓడినవారంతా.. భవిష్యత్ వెతుక్కుంటూ పక్కదారులు పడుతున్నారు.
ప్రజలు తమవైపు ఉన్నారని.. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తమకే ఓటేస్తారని జగన్ చెబుతున్నారు.కానీ.. అసలు నేతలు ఉండాలి కదా.. ఎవరినీ పెడితే వారు నేత అయిపోతారా..? అలా అయితే ఎన్నికల ముందు పార్టీలన్నీ బలమైన నేతల కోసం ఎందుకు వెతుకుతున్నాయి.. ఎవరో ఒకరిని నిలబెడితే పోలా..? కాస్త ముఖపరిచయం ఉండి, అంగబలం, అర్థబలం ఉన్నవాళ్లైతే .. సంక్షోభ సమయంలో గెలిచే అవకాశముంటుందన్నది అందరికి తెలిసిందే. అలాంటిది ఈ సంక్షోభ సమయంలో జగన్ ఇలాంటి కామెంట్లు చేస్తుండడంతో.. ఇక చాలా మంది తట్టా బుట్టా సర్దేసుకుంటున్నట్లు సమాచారం.