ASBL Koncept Ambience
facebook whatsapp X

2029లో మళ్లీ మనమే..

2029లో మళ్లీ మనమే..

దారుణ ఓటమి నైరాశ్యంలో ఉన్న కేడర్ కు ధైర్యం చెప్పేందుకు వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భయమొద్దు.. పారిపోవద్దు.. ధైర్యంగా పోరాటం చేద్దాం..వచ్చే ఎన్నికల్లో మనకు ప్రజలు అత్యధికసీట్లతో పట్టం గడతారు. చంద్రబాబు చేసిన మోసాలు తెలిసిన తర్వాత ప్రజలకు మనపై ప్రేమ పెరుగుతుంది. అప్పుడు మనదే విజయమంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని జోస్యం చెబుతున్నారు జగన్.

శకుని పాచికలు లాంటివీ ఫలితాలు...

ఇప్పుడొచ్చిన ఫలితాలు శకుని పాచికల్లాంటివి.. వారికి కావాల్సినట్లుగా పడ్డాయి. ఇది ఇంటర్వెల్‌ మాత్రమే’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. తలదించుకునే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. ఎప్పటికైనా ధర్మం, నిజమే గెలుస్తాయి. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్‌ డిజిట్‌లోనే సీట్లు వస్తాయి అని పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో మాట్లాడారు.

ప్రజలపై కోపమొద్దు...

అంతేకాదు..ప్రజలపై మనం కోప్పడాల్సిన అవసరం లేదు.. ఒక్కోసారి మోసపోతారు. అలా మోసపోయిన వారందరికీ మనం అండగా ఉన్నామనే భరోసానివ్వాలి. చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు మోసపోవడం వల్లే మనకు అపజయం కలిగింది. ఆ మోసాలు తేటతెల్లమవగానే ప్రజల్లో మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం మొదలవుతాయి. మనల్ని గొప్ప మెజారిటీలతో గెలిపిస్తారు. మీరంతా ఓడిపోయామనే భావన మనసులోంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది. చెప్పిన పనులు చేశాం కాబట్టి తలెత్తుకుని మనం ప్రతి ఇంటికీ వెళ్లగలం’ అన్నారు.

అసెంబ్లీలో మనమేమీ చేయలేం

మనకు వచ్చిన సంఖ్యాబలం చాలా తక్కువే కాబట్టి, అసెంబ్లీలో మనం ఏదో చేయగలమని నాకైతే నమ్మకం లేదు. ప్రజల కోసం పోరాటాలను వేగవంతం చేద్దాం. మన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వాళ్లకు అండగా నిలవండి. మన కోసం నిలబడ్డారు, జెండాలు మోసి నష్టపోయారు, ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. మీ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి నష్టం జరిగినా వెళ్లండి, మీ తరఫు నుంచి సాయం చేయండి. పార్టీ నుంచి ఇచ్చే సాయాన్నీ అందించండి. ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉండి, భరోసా ఇద్దాం’ అని నేతలకు చెప్పారు.

దీనికితోడు చంద్రబాబు సర్కార్ కు హానీమూన్ పీరియడ్ ముగియగానే ప్రజాసమస్యలపై పోరాటం చేద్దాం.. ప్రజల్లోకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుదామన్నారు జగన్. అంటే .. ఇప్పుడు టీడీపీ నేతల చేతుల్లో గాయపడిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించి.. వారి కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు జగన్.అంటే మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమవుతున్నారు జగన్ అని చెప్పొచ్చు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :