'గవర్నర్ గిరీ' పై సుప్రీం ఏమంటోంది..?

గవర్నర్ వ్యవస్థ రాజకీయ రంగు పులుముకుంది. విపక్ష ప్రభుత్వాలున్నచోట... వాటిని ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ముఖ్యంగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేరళ గవవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ఢిల్లీ గవర్నర్ సక్సేనా నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్ ను రాజ్ భవన్ లో అట్టేపెట్టడంపై పెద్ద చర్చే జరుగుతోంది. దీనికి తోడు ఈవ్యవహారం ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో వాజ్యానికి కారణమైంది.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యంపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. గవర్నర్ ఆర్ ఎన్ రవికి సూటి ప్రశ్న వేసింది. 2020లో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుల విషయంలో ఏదో ఒకటి తేల్చకుండా మూడేళ్లుగా ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించింది. పంజాబ్, కేరళలలో కూడా గవర్నర్లు ఇలాగే చేస్తున్నారని ఆయా ప్రభుత్వాలు ఆరోపణలు చేస్తున్న క్రమంలో విచారించిన ధర్మాసనం గవర్నర్ల తీరును తప్పుబట్టింది.
ప్రభుత్వం శనివారం మళ్లీ అసెంబ్లీని సమావేశపరిచి పది బిల్లుల్ని ఆమోదించింది. వాటిని గవర్నర్ కి తిప్పి పంపింది. కోర్టు ఈ పరిణామాలన్నీ గమనించి.. అసెంబ్లీ మళ్లీ బిల్లులను ఆమోదించి గవర్నర్కు పంపింది. గవర్నర్ ఏం చేస్తారో చూద్దాం అంటూ విచారణను డిసెంబరు 1కి వాయిదా వేసింది. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే బిల్లులను ఆలస్యం చేశారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలతో ఎన్నికైన పాలనను అణగదొక్కడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కామెంట్స్ చేసింది. రవి తనకు సమర్పించిన 181 బిల్లుల్లో 162 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు కోర్టు పేర్కొంది.
ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు మూడే ఆప్షన్స్ ఉంటాయని.. ఆయన వద్దకు పంపిన బిల్లులకు ఆమోదం తెలపడం.. రిజెక్ట్ చేయడం.. లేదా రాష్ట్రపతికి పంపడం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిబంధన ప్రకారం గవర్నర్ పునఃపరిశీలన కోసం బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపవచ్చు అని కోర్టు చెప్పింది. "గవర్నర్ రవి ఇంతకుముందు కూడా చాలా ఆలస్యం తర్వాత నీట్ మినహాయింపు బిల్లును వాపసు చేశారు. అసెంబ్లీ మళ్లీ బిల్లును ఆమోదించిన తర్వాత మాత్రమే దానిని రాష్ట్రపతికి పంపారు. ఆన్లైన్ గేమింగ్పై నిషేధం కోరుతూ వచ్చిన బిల్లుపై ఆయన ఇదే వైఖరిని అవలంబించారు" అని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా గవర్నర్లు ఏళ్లుగా కొన్ని బిల్లుల ఆమోదంపై తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.






