ఎడారి దేశాలపై జలఖడ్గం..
పశ్చిమాసియాలోని ప్రధాన ఆర్థిక కేంద్రం దుబాయ్.. భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. రెండురోజులుగా కురిసిన భారీ వర్షానికి వీధులు చెరువులను తలపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్వేపై మోకాలిలోతు నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే వాటిని దారిమళ్లిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. తీవ్ర గాలుల తాకిడికి.. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. చాలా మంది కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. వీధుల్లోని, రహదారుల్లోని నీటిని తోడడానికి అధికారులు ట్యాంకర్లను పంపించారు. కేవలం 12 గంటల్లో వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అల్లాడింది. మొత్తంగా చూస్తే 24 గంటల్లో 162 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అక్కడివాతావరణశాఖ తెలిపింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి .. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రయాణికులు, జనం అల్లాడారు. బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియాలోనూ వర్షాలు కురుస్తున్నాయి.
అయితే ఎడారి దేశంలో ఈ స్థాయి వర్షాలు చాలా అరుదు. అలాంటిది గత రెండు మూడు సంవత్సరాల్లో తరచూ ఇలా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావారణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కురిసిన వర్షాలు.. దేశచరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారులు తెలిపారు. దీంతో స్కూల్స్, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు.
ఇవాళ కూడా వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధకారులు హెచ్చరించారు. అవసరమైతే తప్ప, బయటకు రావొద్దని సూచించారు. మరోవైపు పొరుగునున్న ఒమన్లో కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య 18కు చేరగా.. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఆ దేశ అత్యవసర నిర్వహణ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.