వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా..? ఊడుతుందా..?
![వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా..? ఊడుతుందా..?](https://www.telugutimes.net/storage/news/news_new_74381.jpg)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యంత వివాదాస్పద అంశం వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ల ద్వారా లబ్ది పొందేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోందని.. వాళ్ల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఆరోపించాయి. అయితే వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయని వైసీపీ చెప్తూ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మందికి పైగా వాలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే దమ్ముందా అని వైసీపీ విపక్షాలకు సవాల్ చేస్తూ వచ్చింది. విపక్షాలు కూడా కాదనలేక వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని.. పైగా రూ.5వేల కాకుండా రూ.10వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది.
ఇప్పుడు సీన్ మారింది. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయింది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఓడిపోయిన వైసీపీ.. తమ ఓటమికి వాలంటీర్లే కారణమని ఆరోపిస్తోంది. వాలంటీర్లను నమ్ముకున్న జగన్.. స్థానిక నేతలను డమ్మీలుగా మార్చేశారని .. అందుకే పార్టీకి ఇంతటి దారుణ పరాభవం ఎదురైందని చెప్పుకుంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల పార్టీకి నష్టం జరిగిందే తప్ప లాభం లేదని వైసీపీ నేతలు అంచనాకు వచ్చారు. ఇన్నాళ్లూ వాలంటీర్ వ్యవస్థ వల్లే వైసీపీ లబ్ది పొందుతుందని భావించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఇప్పుడు అంతర్మథనంలో పడ్డాయి.
వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని.. పైగా రూ.10వేల భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే ఈ వ్యవస్థ వల్ల రేపు తమకు కూడా వైసీపీకి పట్టిన గతి పడుతుందేమోననే ఆందోళన, భయం కూటమి పార్టీలను వెంటాడుతోంది. అయితే హామీ ఇచ్చాం కాబట్టి దానికి కట్టుబడి ఉండాలనే ఆలోచనలో ఉన్నాయి కూటమి పార్టీలు. ఇప్పుడున్న పద్ధతిలో కాకుండా కాస్త మార్పులు, చేర్పులతో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు. దీన్ని వంద ఇళ్లకు మార్చేలా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా అన్ని పథకాలను కాకుండా పెన్షన్లు, సమాచార సేకరణ లాంటి వాటిని మాత్రమే వాలంటీర్ల ద్వారా చేయించడం ద్వారా విమర్శలకు తావుండదని భావిస్తున్నట్టు సమాచారం. పైగా స్థానిక నేతలకు కూడా సచివాలయ వ్యవస్థలో భాగస్వాములను చేయడం ద్వారా కేడర్ కు కూడా గుర్తింపు లభిస్తుందని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)