పులివర్తి నానికి మద్దతుగా వంగవీటి రాధ..
తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో బలిజ సామాజిక వర్గీయుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా వంగవీటి రాధా పాల్గొన్నారు. తన తండ్రి దివంగత వంగవీటి రంగ చిత్రపటానికి ఈ సందర్భంగా రాధా నివాళులర్పించారు. అనంతరం పులివర్తి నానీతో కలిసి బైక్ ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నేత పులివర్తి నాని అని స్పష్టం చేశారు. చంద్రగిరి కూటమి నేతలు, కార్యకర్తలు పులివర్తి నాని గెలుపు తమ గెలుపు అని భావించి కృషి చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు ఈసారి చంద్రగిరిలో పులివర్తి నాని గెలుపు ఖచ్చితం అన్న ధీమా వ్యక్తం చేశారు. సర్వే రిపోర్ట్లు కంటే కూడా ప్రజల మనోభావాలను తమ పార్టీ ఎక్కువగా నమ్ముతుందని స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల ఏళ్ల తర్వాత ప్రజల ముందుకు వచ్చిన వారి కంటే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్న వారిని వారు నమ్ముతారని అన్నారు. అమ్మ ఒడి ఇచ్చాం.. డబ్బులు పంచేశాం.. అనేవారు చదువుకున్న తర్వాత యువత భవిత గురించి పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.