డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్.. అందుకే ఈ అబద్ధాలు: ఉత్తమ్కుమార్ రెడ్డి
![డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్.. అందుకే ఈ అబద్ధాలు: ఉత్తమ్కుమార్ రెడ్డి](https://www.telugutimes.net/storage/news/news_new_70983.jpg)
బీఆర్ఎస్ నేత కేసీఆర్ డిప్రెషన్లో, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందుకే అబద్ధాలు ఆడుతున్నారని కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్.. జిల్లాల పర్యటనలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనన్నారు. ‘‘ఆదివారం మీడియా ముందు కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే. ఆయన డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అప్పట్లో జాతీయ పార్టీ అన్నారు. కానీ ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీనే మిగలదు. ఆ భయమే ఆయనలో మొదలైంది. ఇంత త్వరగా ఏ పార్టీ కుప్పకూలలేదు. కేసీఆర్ కుటుంబసభ్యులు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు’’ అంటూ ఉత్తమ్ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పంట బీమాను రద్దు చేశారని, దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, రైతులకు పంట బీమా ఇవ్వని ప్రభుత్వం కేసీఆర్దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నష్టపోతే వారికి బీమా పరిహారం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్పై ఉత్తమ్కుమార్ విరుచుకుపడ్డారు. విద్యుత్ విషయంలో ఆ పార్టీ ఏదో గొప్పలు సాధించామని చెప్పడం అబద్ధమన్న ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన సమయంలో ఎన్టీపీసీకి సహకరించి ఉంటే 4వేల మెగావాట్ల విద్యుత్ ఉచితంగా వచ్చేదని, అలా చేయకపోవడం వల్ల ఆ విద్యుత్ మొత్తాన్ని నష్టపోయామన్నారు. ప్రస్తుతం తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు గురించి ఆలోచించకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తోందని, ఒక్కో ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందిస్తోందని తెలిపారు.
అలాగే నీటిపారుదల రంగం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు ఉందా? అని ప్రశ్నించిన ఉత్తమ్.. బీఆర్ఎస్ హయాంలో నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసం ప్లాన్, డిజైన్లు లేకుండా బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టులు నిర్మించిందని ఆరోపించారు. కాళేశ్వరంపై మాట్లాడేందుకు కేసీఆర్ సిగ్గుపడాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు.. వారి హయాంలోనే కూలిపోయిందని, దానిపై ప్రశ్నిస్తే.. ‘ఒక్క పిల్లరే కదా కుంగింది. అమెరికాలో బ్యారేజీ కుంగలేదా?’ అంటూ కేసీఆర్ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించింది కేసీఆరేనని, ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్వహణకు ఏడాదికి రూ.10వేల కోట్లు విద్యుత్ ఖర్చే అవుతోందని వివరించారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)