వేసవి సెలవులు పొడిగించే ఆలోచనలో తెలంగాణ సర్కార్
తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల వేసవి సెలవుల గడువును పెంచాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. మార్చి 15వ తేదీ నుంచి పాఠశాలల్లో ఒంటిపూట బడులు అమలులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. అలాగే ఈ నెల 24 నుంచి పాఠశాలలన్నింటికీ వేసవి సెలవులు ఇస్తున్నామని, జూన్ 11 వరకు ఈ సెలవులు కొనసాగుతాయని ఈ మధ్యనే ప్రభుత్వం ప్రకటించింది.
అంటే మొత్తం 45 రోజులపాటు సెలవులు ఉండబోతున్నాయన్నమాట. కాగా.. ప్రస్తుతం వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సెలవులను మరింత పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై విద్యాశాఖ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏప్రిల్ 24 నుంచే ప్రారంభం కానున్న వేసవి సెలవులు జూన్ 13 వరకు కొనసాగనున్నాయి. అంటే 50 రోజుల తర్వాత మళ్లీ స్కూల్స్ రీ-ఓపెన్ అవుతాయన్నమాట.