తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగం కావాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని ప్రవాస భారతీయులకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పులతో రాష్ట్రాన్ని దివాళ తీయించిన కేసీఆర్ దోపిడీని ఇంకెంతకాలం భరిద్దామని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన పేర్కొన్నారు. అన్నివర్గాల పోరాటాలు, త్యాగంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. కేసీఆర్ కుటుంబమే తొమ్మిదేళ్లుగా పాలిస్తూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని, అలాగే తొమ్మిదేళ్లలో రూ.17 లక్షల కోట్లను బడ్జెట్లో చూపారని అన్నారు. మొత్తం రూ.22 లక్షల కోట్లని అంత డబ్బు ఖర్చు చేసినప్పుడు తెలంగాణ ప్రజల జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదని ఆరోపించారు.






