బే ఏరియాలో మినీ మహానాడు

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో 3వ మినీ మహానాడు జులై 31వ తేదీ ఆదివారం కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నిర్వహిస్తున్నట్టు ఎన్నారై టీడిపి యుఎస్ఎ కో ఆర్డినేటర్ జయరాం కోమటి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిలుగా పాల్గొంటారని వెల్లడించారు. తెలుగువాళ్ళంతా ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
ప్రపంచ తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ అని అంటూ, జాతి నిర్మాణం వైపు తెలుగు ప్రజలను జాగృతం చేశారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్. ఆయన నేటి తరానికి ఒక స్ఫూర్తి. భావితరాలకు ప్రేరణ. అందుకే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించబోతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రతి నెల ఒక రాష్ట్రంలో ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే బోస్టన్, న్యూజెర్సీలో నిర్వహించినట్టు పేర్కొన్నారు.






