ఘనంగా తామా క్రోధినామ ఉగాది వేడుకలు
అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న అట్లాంటాలోని డెన్మార్క్ హైస్కూల్లో నిర్వహించిన శ్రీ క్రోధినామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉగాది ఉత్సవాలకు సంప్రదాయ వస్త్రధారణతో 2000 మందికి పైగా ప్రజలు హాజరై సంప్రదాయ ఉగాదిని జరుపుకున్నారు.ఈ ఉత్సవాలకు ప్లాటినం స్పాన్సర్లుగా హాట్ బ్రెడ్స్, గోల్డ్ స్పాన్సర్స్ గా, శేఖర్ రియాల్టీ, నార్త్ ఈస్ట్ మార్ట్ గేజ్, స్ప్లాష్ బి ఐ, అప్ 2 డేట్ టెక్నాలజీస్, రెడ్డిక్స్ లెండిరగ్, అట్లాంటా హైడ్రేషన్స్ వ్యవహరించారు. సిల్వర్ స్పాన్సర్స్గా వేళా లైఫ్ ప్లాన్, విషి అండ్ వీకి, అమృత్ ఆయుర్వేద, భూమి రియాల్టీ, స్మైల్ అండ్ షైన్ డెంటల్, విపిర్ రియాల్టీ, గరుడ వేగా బ్రాంజ్ స్పాన్సర్స్ గా సన్ లైట్ టెక్నాలజీస్, శ్రీ లక్కీ ఫైనాన్సియల్ గ్రూప్ సహాయం అందించారు.
ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యశ్వంత్ జొన్నలగడ్డ మరియు రోబోథింక్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ సాకర్ బాట్ పోటీలు నిర్వహించగా 60 మంది పిల్లలు, చిత్రకళలను కృష్ణ ఇనపకుతిక ఆధ్వర్యంలో 120 మంది పిల్లలు హాజరయ్యారు. అలాగే మినీ మొక్ టేస్ట్ను థింక్ టేల్స్ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో 60 మంది పిల్లలు మరియు డిజిటల్ ఏజ్ పేరెంటింగ్ వర్కుషాప్ను గ్లోబల్ అకాడమీ నేతృత్వంలో నిర్వహించగా 50కి పైగా పెద్దలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభవైభవాన్ని చాటారు. శశి దగ్గుల, శ్రీనివాసులు రామిశెట్టి పర్యవేక్షణలో వివిధ రకాల వ్యాపారులు ఏర్పాటు చేసిన 30 కిపైగా స్టాల్స్ లో ప్రత్యేక ఆహార పదార్ధాలు, ఆభరణాలు, వస్త్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలకు యాంకర్గా శ్రీమతి లావణ్యగూడూరు వ్యవహరించారు. తనదైన శైలిలో కార్యక్రమాల విశేషాలను తన వ్యాఖ్యానంతో ఆమె చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
పండితులు రవి శర్మ గారు ఉగాది పంచాంగ శ్రవణం గావించగా, తమ తమ రాశిఫలాల వివరాలను సభలోని వారందరూ శ్రద్ధగా ఆలకించారు.
ఉగాది ఉత్సవాలను ముందుగా తామా సాంస్కృతిక కార్యదర్శి సునీల్ దేవరపల్లి జ్యోతి ప్రజ్వలన చేయుటకు అందరిని వేదిక పైకి ఆహ్వానించారు. తర్వాత కార్యక్రమంలో అధ్యక్షుడు సురేష్ బండారు కార్యవర్గ మరియు బోర్డ్ సభ్యులను ఆహుతులకు పరిచయం చేశారు.
అనంతరం సురేష్ బండారు మాట్లాడుతూ ఏ దేశమేగినా ఎందుకాలిడినా సాంప్రదాయాలను విడనాడని గడ్డ నుంచి వచ్చినవారే తెలుగువారిని పేర్కొంటూ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు.
అలాగే తామా బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఉప్పు మాట్లాడుతూ ఉగాది పండుగంటే తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభ వేడుకని పండుగ ప్రాశస్త్యాన్ని మరియు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని దాని ఆవశ్యకతను వివరించారు.అమెరికాలో స్థిరపడిన తెలుగు వారంతా సాంస్కృతిక ప్రదర్శనలు అందించి చిన్నారులు, మహిళలు మరియు పురుషులు తమ ప్రతిభ పాటలను ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తెలుగు గాయకులు కారుణ్య, గాయని మాళవిక ఆలపించిన పాటలు ఉర్రూతలూగించాయి. పాటలకు చిన్నారులు, మహిళలు పురుషులతో పాటు పెద్దలు సైతం నృత్యాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత హస్తకళల కేంద్రమైన బొబ్బిలి నుంచి కళాకారుల స్వహస్తాలతో తయారు చేయబడిన బొబ్బిలి వీణలను ప్రత్యేకంగా తెప్పించి తామావారు స్పాన్సర్లకు అందజేయటం ఎంతో విశేషం.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా రమేష్ బాబు గారిని మరియు డిస్ట్రిక్ట్ 4 కమీషనర్ సిండీ జోన్స్ మిల్స్ ను శాలువాతో పాటు పుష్పగుచ్చాలు అందించి మరియు బొబ్బిలి వీణలను బహుకరించి ఘనంగా సత్కరించారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ తామా తెలుగు పండుగలను భావితరాలకు పరిచయం చేసేలా జరుపుకుంటూ ముందుకు సాగుతుండటం అభినందనీయమన్నారు. సాంస్కృతిక కార్యదర్శి సునీల్ దేవరపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగానే ఈసారి కూడా బంతి భోజనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందమందికి పైగా వాలంటీర్లు పాల్గోని ఒక్కో బంతికి 250 మంది చొప్పున 8 బంతులకు ఆప్యాయంగా విస్తరాకులలో వడ్డించడం జరిగింది. ఇంత మందికి భోజన ఏర్పాట్లు చేసిన తామా వారిని అందరూ ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు రాష్ట్రాల నుండి తెప్పించిన మామిడి తాండ్ర, పాలకోవా, మాడుగుల హల్వా, పండు మిరపకాయ కొత్తిమీర పచ్చడి, ఆవకాయ, నువ్వుల కారం, పప్పుల పొడి, వడియాలు, చల్ల మిరపకాయలు ఇంకా నోరూరించే వంటకాలతో పాటు షడ్రుచుల ఉగాది పచ్చడి వచ్చిన అతిథులందరూ ఆస్వాదించారు.
ఈ కార్యక్రమంలో తామా కార్యవర్గ మరియు బోర్డ్ సభ్యులు శ్రీనివాస్ ఉప్పు, సురేష్ బండారు, చలమయ్య బచ్చు, ప్రియాంక గడ్డం, రాఘవ తడవర్తి, సునీత పొట్నూరు, ప్రవీణ్ బొప్పన, రవి కల్లి, ఇన్నయ్య ఎనుముల, యశ్వంత్ జొన్నలగడ్డ, సుమ పోతిని, వెంకట శివ గోక్వాడ, కృష్ణ ఇనపకుతిక, పవన్ దేవులపల్లి, నగేష్ దొడ్డాక, తిరు చిల్లపల్లి, శశి దగ్గుల, శ్రీనివాసులు రామిశెట్టి, రూపేంద్ర వేములపల్లి, సునీల్ దేవరపల్లి, సత్య నాగేందర్ గుత్తుల, మధు యార్లగడ్డ పాల్గొన్నారు.
చివరిగా ఉగాది ఉత్సవాలను అత్యద్భుతంగా విజయవంతం చేసిన అట్లాంటా తెలుగు ప్రజలకి, స్పాన్సర్స్ కి, రుచికరమైన విందు భోజనాలను అందించిన హాట్ బ్రెడ్స్ యాజమాన్యానికి, వాలంటీర్స్ కి, కళాకారులకి మరియు ప్రేక్షకులందరికీ సభాముఖంగా తామా ఉపాధ్యక్షుడు రూపేంద్ర వేములపల్లి ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.