MKOne Telugu Times Youtube Channel

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మూడువారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని ఆమె దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇరు పక్షాల వాదనలు విన్న బెంచ్‌ విచారణ వాయిదా వేసింది. నేడు ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగింది. కవిత తరపున సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబల్‌ వాదించారు. కవితకు నోటీసులు ఇచ్చే క్రమంలో ఈడీ నియమాలు, నిబంధనలు పాటించలేదు. ఆమెకు ఇచ్చిన నోటీసుల్లో ఇన్వెస్టిగేషన్‌కు రమ్మని  ఆదేశించారు. నిందితురాలు కానప్పుడు  ఇన్వెస్టిగేషన్‌కు ఎలా పిలుస్తారని ఈడీ తీరుపై కపిల్‌ సిబాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈడీ కార్యాలయానికి పిలిచే వ్యవహారంలో అభిషేక్‌ బెనర్జీ, నళిని చిదంబరం కేసులను  ఓసారి పరిశీలించాలని సిబాల్‌ అన్నారు.  అపై ఈడీ తరపున న్యాయవాది వాదిస్తూ విజయ్‌ మండల్‌ జడ్జిమెంట్‌ పీఎంఎల్‌ఏ కేసుల్లో వర్తించదని, పీఎంఎల్‌ఏ చట్టం కింద ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉంటుందని గుర్తు చేశారు. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 160 ఇక్కడ వర్తించదని ఈడీ వాదించింది. ఆపై లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఈడీ, కవితలను ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం.

 

 

Tags :