మృతదేహం తరలింపునకు ఎన్నారైల సాయం.. రూ.20 లక్షల వితరణ
అమెరికాలో ఇటీవల స్విమ్మింగ్ పూల్లో మునిగి మృతి చెందిన ఖమ్మం జిల్లా విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్కుమార్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎన్నారైలు తమ వంతుగా ఆర్థిక సాయం అందించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన శ్రీనాథరాజు కిరణ్కుమార్ ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. గత వారం ప్రమాదవశాత్తు స్విమ్మింగ్పూల్లో మునిగి కిరణ్ కుమార్ మృతి చెందాడు. ఈ సంఘటన అమెరికాలో ఉన్న ఎన్నారైల హృదయాలను కదిలింది. కిరణ్ కుమార్ మృతదేహాని స్వదేశానికి తీసుకురావడానికి సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. దీంతో అమెరికాలోనే ఉన్న చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన ఎన్నారైలు తిరుమలశెట్టి గోపీ, కమ్మంపాటి అంజనేయులు, మాదిరాజు శ్రీనివాసరావు అమెరికాలో ఉన్న తెలుగువారందరి సోషల్ మీడియా గ్రూప్లలో పోస్ట్ చేశారు. దీంతో ఎంతో మంది తెలుగు ఎన్నారైలు ముందుకు వచ్చి తమ వంతుగా రూ.20 లక్షల సాయం చేశారు. గురువారం నాటికి కిరణ్ మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో కిరణ్ అంతక్రియలు నిర్వహించేందుకు స్థానికంగా ప్రభుత్వం పాఠశాల పూర్వ విద్యార్థులు, మిత్రబృందం కూడా ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు.