శ్రీవారి ఆలయంలో వైభవంగా ..శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల సేవ, అర్చన అనంతరం రంగనాయకుల మండపం ఉదయం 9 నుంచి 11 వరకు స్నపన తిరుమంజనం కనులపండువగా నిర్వహించారు. వేదపఠనంతో శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 వరకు హనుమంత వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో శ్రీమలయప్పస్వామి కొలువుదీరి భక్తులను కటాక్షించారు. రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారు వాకిలీ వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని పండితులు చేపట్టారు. గురువారం సాయంత్రం 5 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేతం హనుమంతులవారి ఉత్సవర్లకు సహస్ర దీపాలంకార సేవ.. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఆలయ అర్చనకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ పెద్దజీయర్, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.