చంద్రబాబు వర్సెస్ రోజా.. శ్రీరామనవమిని కూడా వదలరా..
ఏపీ రాజకీయాలలో మాటల దాడులు కొత్త కాదు.. అయితే తొలిసారిగా చంద్రబాబు వర్సెస్ రోజా మధ్య మాస్ వార్ షురూ అయింది. నేరుగా జరగకపోయినా.. చంద్రబాబు మాటలను రోజా వ్యాఖ్యానించడంతో వాటిని చంద్రబాబు తిప్పి కొట్టారు. అసలు విషయం ఏమిటంటే.. శ్రీరామనవమి సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యం రావడానికి మరికొన్ని రోజులే ఉన్నాయి అని అన్నారు. అలాగే హిందూ భక్తుల మనోభావాలకు గొడ్డలిపెట్టుగా వైసీపీ పాలన ఉంది అనడంతో పాటు గతంలో జరిగిన ఓ 160 సంఘటనల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడి జరుగుతున్నా.. సీఎం పట్టించుకోవడం లేదు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు మంత్రి రోజా తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుని ఏకంగా రావణాసురుడితో పోలుస్తూ.. రావణుడి ప్రతిరూపమైన చంద్రబాబు నోటి వెంట ఇలాంటి అబద్ధాలు కాక ఇంకేమి వస్తాయి అని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో విజయవాడలో కొన్ని వందల దేవాలయాలను కాల్చిన విషయాన్ని ఈ సందర్భంగా రోజా గుర్తు చేశారు. జగన్ పాలన రామరాజ్యమని పేర్కొన్న రోజా.. చంద్రబాబు లాంటి రాక్షసులు తప్పుడు చరిత్రను సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.