రాజీనామాలపై చర్యలేవి?.. రాజస్థాన్ స్పీకర్కు హైకోర్టు నోటీసులు!
రాజస్థాన్ ఎమ్మెల్యేల రాజీనామాలపై చర్యల గురించి ప్రశ్నిస్తూ.. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎం అశోక్ గెహ్లాట్ మద్దతు దారులు కొన్ని రోజుల క్రితం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరిలో గెహ్లాట్ నిలబడటంతో.. తర్వాతి సీఎంగా సచిన్ పైలట్ను ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సెప్టెంబర్ 25న సీనియర్ నేతలతో కూడిన కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. అయితే పైలట్కు వ్యతిరేకంగా గెహ్లాట్ మద్దతుదారులు మూకుమ్మడిగా కదిలారు. సమావేశాన్ని వ్యతిరేకించడమే కాకుండా.. తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను ఆమోదించాలని ప్రతిపక్ష బీజేపీ నేతలు స్పీకర్ జోషికి విజ్ఞప్తులు చేశారు. కానీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 90 రోజులవుతున్నా స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకోకపోవడంతో ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష ఉపనేత రాజేంద్ర రాథోడ్ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది.