ఖమ్మం రాజకీయాల్లో ఆయన ఒక బచ్చా : మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక బచ్చా అని, డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నాడని మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఓటమి ఖాయమని పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్లో ఉంటూ సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేసిన చరిత్ర పొంగులేటిదని, ఆయనకు ఓ సిద్ధాంతం, విలువ లేవని విమర్శించారు. ఏ పార్టీలోకి పోవాలో తేల్చుకోలేని దుస్థితిలో పొంగులేటి ఉన్నాడన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా అని, పేదలను దోచిన దోపిడీదారులే పొంగులేటి పంచన చేరారని విమర్శించారు. పద్ధతి మార్చుకోవాలని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పినా మారలేదని తెలిపారు. బీఆర్ఎస్లో ఉండి బాగా సంపాదించాడని ఇప్పుడు అదే డబ్బుతో రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి డబ్బులకు ఖమ్మం ప్రజలు అమ్ముడు పోరని తెలిపారు. పొంగులేటి ఆత్మీయ సమావేశాలకు జనాల స్పందన కరువైందని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధి మీద కొందరు కడుపులో విషం నింపుకున్నారని తెలిపారు.