రైతులపై లాఠీఛార్జ్ ఘటనపై బీజేపీ ఫైర్
ఆదిలాబాద్ రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతుల పాలిట కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తం లాంటిదని తీవ్ర విమర్శలు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బుధవారం నాడు రైతులు భారీగా బారులు తీరడంతో వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. లాఠీచార్జ్ కూడా చేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు కాంగ్రెస్ సర్కార్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఇక ఈ ఘటనపై ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసిన బీజేపీ.. రైతుల పాలిట భస్మాసుర హస్తం కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించింది. రైతులకు విత్తనాలు అందించలేని అసమర్థ ప్రభుత్వం అధికార మదంతో ప్రవర్తిస్తోందని, ఆ మదంతోనే అన్నదాతలపై లాఠీఛార్జ్ చేయించిందని, ఇది నిజంగా సిగ్గుచేటని ఘాటు విమర్శలు చేసింది. ఒకపక్క ప్రజా పాలన అంటూనే మరోపక్క ఆ ప్రజలనే రేవంత్ రెడ్డి సర్కార్ అష్ట కష్టాలు పెడుతోందని విమర్శించింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 6 నెలల్లోనే తన అసలు రంగు చూపెడుతోందంటూ రైతులు, పోలీసుల ఘర్షణ వీడియోను షేర్ చేసింది.