షర్మిల దూకుడు.. కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిస్తుందా..?
![షర్మిల దూకుడు.. కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిస్తుందా..?](https://www.telugutimes.net/storage/news/news_new_68285.jpg)
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు నెలల్లోపే ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో పార్టీలన్నీ ఫుల్ యాక్టివ్ అయిపోయాయి. వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన కంకణం కట్టుకున్నాయి. బీజేపీ కూడా ఆ కూటమిలో చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ ఏపీలో సత్తా చాటాలను ఉబలాటపడుతోంది. ఇందుకు ఆ పార్టీ షర్మిలను అస్త్రంగా వాడుకుంటోంది. మరి షర్మిల కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగలదా అనేదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న అంశం.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంచుకోట. దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీ అండగా నిలబడింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్న నేతలంతా ఇతర పార్టీల్లో చేరిపోవడమో లేకుంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడమో జరిగింది. కొంతమంది చిన్నాచితకా నేతలు మాత్రమే ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ పదేళ్లుగా వాళ్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కనీసం 1శాతం ఓట్లను కూడా ఆ పార్టీ సాధించలేకపోయింది. దీంతో ఎలాగైనా పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలనుకుంది కాంగ్రెస్ పార్టీ.
ఇదే సమయంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలకాయ దొరికింది. తెలంగాణలో సత్తా చాటాలనుకున్న షర్మిలకు అక్కడ ఆదరణ లభించకపోవడంతో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయాలనుకుంది. అయితే తెలంగాణ కాకుండా ఏపీలో అయితే అవకాశం ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించడంతో షర్మిల కూడా అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సోదరుడి జగన్ తో వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల్లో విభేదాలొచ్చాయి. రాజకీయంగా కూడా తొక్కేశారని ఆమె మధన పడుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ను వెంటనే ఒప్పుకుంది షర్మిల.
అయితే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలపై ఇప్పుడు పెద్ద బాధ్యతలే ఉన్నాయి. పార్టీని గతంలో కంటే మెరుగ్గా నడిపించాల్సి ఉంటుంది. తనపై అధిష్టానం పెట్టుకున్న ఆశల్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. అదే సమయంలో తన సోదరుడిని ఎదుర్కొని సత్తా చాటితేనే తనకు గుర్తింపు, అధికారం లభిస్తుంది. అందుకే ఆమె పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నారు. మాజీ కాంగ్రెస్ నేతలందరినీ కలుస్తున్నారు. పార్టీలో జోష్ నింపేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత వివిధ పార్టీల్లోని అసంతృప్తులందరికీ కాస్త ఉత్సాహం వచ్చింది. వివిధ పార్టీల్లో టికెట్లు దక్కని వాళ్లు, అక్కడ ఇమడలేని వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో పార్టీలో కూడా కాస్త జోష్ కనిపిస్తోంది. మరి ఇదే జోష్ ఎన్నికల్లో కనిపిస్తుందా.. కనీసం ఒకటి, రెండు సీట్లలో అయినా ఆ పార్టీ నెగ్గుతుందా.. అనేది వేచి చూడాలి.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)