ప్రతీకారం ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్న పవన్ కల్యాణ్!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి రోల్ పోషిస్తారనే దానిపై చాలా ఆసక్తి ఉండేది. వంద శాతం స్ట్రయిక్ రేట్ తో పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యం దక్కుతుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయన కీలక పోర్టుపోలియోలతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇన్నాళ్లూ సినిమాలు, రాజకీయాలకే పరిమితమైన అయన.. ప్రభుత్వంలో ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారు.. పాలన ఎలా సాగిస్తున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే నెలరోజుల్లోనే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు పవన్ కల్యాణ్.
జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ వైసీపీని ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. టీడీపీ నేతల కంటే ఎక్కువగా పవన్ కల్యాణ్ వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. జగన్ ను గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమని.. అందుకోసం ఎవరితో అయినా కలిసి ముందుకెళ్తానని కుండబద్దలు కొట్టారు. టీడీపీ, బీజేపీ కలవడానికి పవనే కీలక కారణం అనే విషయం తెలిసిందే. ఎట్టకేలకు జగన్ ను గద్దె దించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. అయితే జగన్ ను ఓడించేందుకు పవన్ ఎందుకంత మొండిగా వెళ్లారనేదానికి కారణాలేంటని చాలా మంది ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో కొంత మంది వైసీపీ నేతల వల్లే పవన్ పంతానికి పోయారని చెప్పుకుంటున్నారు.
పవన్ ను టార్గెట్ చేసి రెచ్చిపోయిన వాళ్లలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. ఆయన పదేపదే పవన్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. పదునైన భాషతో విరుచుకపడ్డారు. దమ్ముంటే రా అంటూ సవాళ్లు విసిరారు. పవన్ వ్యక్తిగత విషయాలపైనా నోరు పారేసుకున్నారు. దీంతో ద్వారంపూడిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలని పవన్ కల్యాణ్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టుగానే పవన్ అధికారంలోకి రాగానే ఆపరేషన్ ద్వారంపూడిని స్టార్ట్ చేశారు. పైకి కనిపించకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్టు వ్యవహరిస్తూ లోలోపల అంతా చక్కబెట్టేస్తున్నారు.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాపారవేత. ఆయనకు ఆక్వా పరిశ్రమలున్నాయి. బియ్యం ఎగుమతుల్లో ఆయన చాలా పాపులర్. ఇప్పుడు తన ఆక్వా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించట్లేదంటూ నోటీసులు అందుకున్నాయి. అదే సమయంలో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలోని బియ్యం గోదాములను ప్రత్యక్షంగా వెళ్లి సందర్శించారు. అవకతవకలను గుర్తించి సీజ్ చేశారు. దీంతో ద్వారంపూడి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఆయన ఆర్థికమూలాలపైనే పవన్ కల్యాణ్ దృష్టిపెట్టి టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. గతంలో ద్వారంపూడి నోరు పారేసుకోవడం వల్లే ఇప్పడీ పరిస్థితి తెచ్చుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.