న్యూయార్క్ కీలక నిర్ణయం... జూన్ నుంచి అమలు
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తున్న న్యూయార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. మన్హట్టన్లోని రద్దీ ప్రాంతంలో ఇకపై కార్లు ప్రవేశిస్తే రద్దీ రుసుముగా 15 డాలర్లు వసులు చేయాలని నిర్ణయించింది. జూన్ మధ్య నుంచి ఇది అమల్లోకి రానుంది. రద్దీ టోల్ వసూలు చేయాలన్న నిర్ణయాన్ని న్యూయార్క్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ 11-1 ఓట్లతో ఆమోదించింది. క్వీన్స్, బ్రూక్లిన్, న్యూజెర్సీ నుంచి మన్మట్టన్ సౌత్ 60వ స్ట్రీల్లోకి ప్రవేశించే ట్యాక్సీలు, ప్రయాణికుల, వాణిజ్య వాహనాలు పగటి వేళలో అయితే 15 డాలర్లు, రాత్రివేళ అయితే 3.75 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. పగటి వేళ ట్రక్కులు 24 డాలర్లు, సైట్సీయింగ్ బస్సులు 36 డాలర్లు చెల్లించాలి. రాత్రివేళ ఇది కొంత తక్కువగా ఉంటుంది. ఉబర్ లాంటి రైడ్షేరింగ్ సేవల వాహనాలకు ప్రతి ట్రిప్కు 2.50 డాలర్లు వసూలు చేస్తారు. అత్యవసర సేవలు అందించే వాహనాలు, దివ్యాంగులను తీసుకెళ్లే వాహనాలను మినహాయించారు. అమెరికాలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.