చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. అంతకుముందు భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఆయన హయాంలో పెట్టుబడులకు చాలా మంది ముందుకొచ్చారు. ఇవాళ పరిశ్రమలు రాకపోగా ఉన్నవి పోయాయి. కులమతాలు వేరైనా మమమంతా ఆంధ్రులం. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా వేధించారు. రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలి. అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొద్దాం అని పిలుపునిచ్చారు.