ఆయన పెట్టిన పథకాలనే ఇప్పుడు అన్ని పార్టీలు.. కొనసాగిస్తున్నాయి : బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి. తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ తొలుత చదువుకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత చిత్రరంగంలోకి వచ్చారు. ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయం. సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఒకే పంథాలో వెళ్తున్న రాజకీయాలను మార్చారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. అంతకుముందు రాజకీయాలంటే కొంతమందికే పరిమితమై ఉండేవి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక డాక్టర్లు, లాయర్లు, అభిమానులు రాజకీయాల్లోకి ఆయన తీసుకొచ్చారు. అధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీనవర్గాలకు పదవులు కట్టబెట్టారు. ప్రభుత్వంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన పెట్టిన పథకాలనే ఇప్పుడు అన్ని పార్టీలు అవలంబిస్తున్నాయి అని అన్నారు.