సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు, జలవనరులు, రైల్వేలైన్ల విస్తరణకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు సమ్మతించాలన్నారు. హైదరాబాద్లో చంద్రబాబును ఆయన నివాసంలో మంత్రి తుమ్మల కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను విన్నవించారు. పట్టిసీమ నుంచి పులిచింతల లింక్ ద్వారా శ్రీశైలం నీటితో రాయలసీమ సాగునీటి కష్టాలు తీరుతాయి. దీని వల్ల తెలంగాణకూ మేలు జరగుతుంది. సత్తుపల్లి నుంచి కోవూరు రైల్వేలైన్, పెనుబల్లి నుంచి కొండపల్లి రైల్వేలైన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరం. కొత్తగూడెం నుంచి పెనుబల్లి రైల్వేలైన్ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ లో దీని కొనసాగింపు లైన్పై దృష్టి సారించాలని తుమ్మల కోరారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో భేటీ ఎంతో ఆప్యాయంగా సాగిందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించామని, జల వివాదాలు పరిష్కరించుకొని ప్రగతిపథంలో సాగేందుకు చంద్రబాబు అనుభవం ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు.