మమత బెనర్జీ కీలక నిర్ణయం... వారికి ప్రభుత్వ ఉద్యోగం

ఒడిశాలోని బాలేశ్వర్లో మూడు రైళ్లు డీకొని జరిగిన ఘోర ప్రమాదం లో బాధిత కుటుంబాలను ఆదుకొనే విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోల్కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్న వారికి నగదు సాయం అందిస్తామన్నారు. భువనేశ్వర్, కటక్ వెళ్లి అక్కడ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం బెంగాల్కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారని, ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో 33 మంది పరిస్థితి విషమంగా ఉండగా, వారంతా కటక్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. రైలు దుర్ఘటన అంశంలో ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లబోనన్న దీదీ, క్షతగాత్రులు, వారి కుటుంబాలకు సాయం గురించే ఆలోచిస్తున్నట్లు తెలిపారు.






