లోకేష్ నామినేషన్ పత్రాలు సమర్పించిన కూటమి నేతలు..
నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన తరఫున ఎన్డీఏ కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తరలివచ్చిన వీరు మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల లోకేష్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీనికి ముందు లోకేష్ నామినేషన్ పత్రాలకు స్థానిక ఆలయంలో పూజలు కూడా జరిపించారు. అంతేకాదు సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఆ తర్వాత కార్పొరేషన్ కార్యాలయం వరకు మూడు పార్టీలకు సంబంధించిన శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించాయి. ఈరోజు మంగళగిరి పట్టణంలోని రహదారులు జన సంద్రంలా మారాయి. మిద్దె సెంటర్, సీతారామస్వామి కోవెల సెంటర్ మధ్య ప్రదేశం అంతా కూటమి జెండాలతో కలకలలాడింది. కాగా లోకేష్ నామినేషన్ దాఖలకి ప్రత్యేకంగా తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయ పూజారులు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. ఆ ముహూర్తం ప్రకారం కూటమి నేతలు లోకేష్ తరఫున నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈసారి మంగళగిరిలో లోకేష్ విక్టరీ ఖాయం అని ఈ సందర్భంగా వారు తెలియపరచారు.