ASBL NSL Infratech

లోక్‌సభ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్న రేవంత్ రెడ్డి..!

లోక్‌సభ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్న రేవంత్ రెడ్డి..!

తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తరపున రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. దీంతో ఆయనపై నమ్మకం మరింత పెరిగింది. హైకమాండ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగియకముందే ఇప్పుడు లోక్ సభ ఎన్నికలను రేవంత్ రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తోంది. తన 4 నెలల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండంలాగా మారబోతున్నాయి. దీన్ని కూడా తనదైన శైలిలో ఎదుర్కొని సత్తా చాటేందుకు రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా ప్రభుత్వంపైనే దృష్టిపెట్టారు. వంద రోజుల్లోపు 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడంతో వాటిని నెరవేర్చడంపైనే ఆయన ఫోకస్ పెట్టారు. ఎలాగోలా వాటిని అమలు చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిగా పార్టీని పటిష్టం చేసేందుకు, లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు తాము హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లోపు పూర్తి చేయడంతో లోక్ సభ ఎన్నికల్లో అంతకుమించిన అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సాధించడం ద్వారా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉంది.

వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయడంతో అదే అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు. చెప్పింది చేశాం కాబట్టి ఆదరించాలని.. లోక్ సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు మొన్న అసెంబ్లీలో వచ్చిన మెజారిటీలు, ఓట్ల కంటే ఇప్పటి లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు రావాలని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, నేతలకు టార్గెట్ పెట్టారు. దీంతో ఎమ్మెల్యేలు, నేతలు వణికిపోతున్నారు. అసెంబ్లీలో వచ్చిన వాటికంటే తక్కువ ఓట్లు వస్తే తమకు ఇబ్బందులు తలెత్తుతాయేమోనని భావించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

తెలంగాణలో 14 సీట్లు గెలవబోతున్నామని రేవంత్ రెడ్డి హైకమాండ్ కు చెప్పినట్టు సమాచారం. ఒకటి ఎంఐఎంకు, 2 బీజేపీకి వస్తాయని.. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదనేది రేవంత్ రెడ్డి మాట. ఒక్క సీటు గెలుచుకుని చూపించండి అని బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేయడం వెనుక ఉద్దేశం కూడా అదే. అందుకు తగ్గట్టుగానే బీఆర్ఎస్ కేడర్ ను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పినట్టు 14 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఆయనకు పార్టీలో తిరుగుండదు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఓ రేంజ్ కు ఎదగడం ఖాయం.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :