బస్సు యాత్రతో బీజేపీ, కాంగ్రెస్లకు కేసీఆర్ చెమటలు పట్టించారు: కేటీఆర్
బస్సుయాత్రతో తెలంగాణలో రెండు జాతీయ పార్టీలకు కేసీఆర్ ముచ్చెమటలు పట్టించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 17 రోజుల బస్సు యాత్రతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దిగిరాక తప్పలేదని, ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఓటమి భయంతో తెలంగాణ చుట్టూ గింగిరాలు కొడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఏ జిల్లాకు పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా ప్రజలు కేసీఆర్కు బ్రహ్మరథం పట్టారని, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని, గ్యారంటీల పేరుతో మోసం చేసిన ఆ పార్టీని ప్రజలు నమ్మడం లేదని కేటీఆర్ అన్నారు. దాడులు, కేసులు, కుట్రలను తాము సమర్ధవంతంగా తిప్పికొట్టామన్న కేటీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై కూడా విమర్శల వర్షం కురిపించారు. బీజేపీపై ప్రజల్లో సానుకూలత లేదని, పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వల్ల నిత్యావసరాలు, సిలిండర్ల ధరలు పెరగడం తప్ప ఒరిగిందేమీ లేదని, అందుకే ప్రజల్లో ఆ పార్టీపై కూడా వ్యతిరేకత కనిపిస్తోందన్నారు.