సింగరేణిని ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని వేలం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనుల వేలం వేయడం లేదన్నారు. బొగ్గు గనులు కావాలంటే అన్ని సంస్థలకు ఒకే విధానం ఉంది. సింగరేణిని అదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఆ సంస్థలో కొన్ని సమస్యలున్నాయి. వాటిని తప్పకుండా పరిష్కారిస్తాం. ఢిల్లీ వెళ్లాక దీనిపై అధ్యయనం చేస్తా. సింగరేణి విషయంలో బొగ్గుగనుల శాఖ అధికారులకు పూర్తి అవగాహన ఉంది. ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరుతున్నా. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సరికాదు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందకూడదని కోరుతున్నా. వేలం పాట వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది తప్ప కేంద్రానికి కాదు అని అన్నారు.