కండ్లకోయ చుట్టు రియల్ వృద్ధి

హైదరాబాద్లో పశ్చిమ ప్రాంతానికే పరిమితమైన ఐటీని నగరం నలువైపులా విస్తరించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనలో భాగంగా ఉత్తర హైదరాబాద్లో ఐటీ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కండ్లకోయలో 6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఐటీ పార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇది సైబర్ టవర్స్ కంటే విస్తీర్ణమైన స్థలం. ఇప్పటికే కండ్లకోయలో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90కి పైగా కంపెనీలకు అనుమతి పత్రాలను కూడా మంత్రి జారీ చేశారు. భవిష్యత్తులో ఈ ఐటీ పార్క్లో 50 వేల ఉద్యోగ అవకాశాలుంటాయని అంచనా. దీంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం జోరందుకుంది. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, వ్యక్తిగత భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణంలో ఉన్నాయి. జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, కండ్లకోయ, శామీర్పేట, మేడ్చల్ వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది.
నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి వంటి జిల్లావాసులు ఉత్తర హైదరాబాద్లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అపర్ణా, సాకేత్, భువనతేజ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు మేడ్చల్ జాతీయ రహదారిలో భారీ ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్లను చేపడుతున్నాయి. అలాగే పశ్చిమాదిలో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న పలు బడా నిర్మాణ సంస్థలు మేడ్చల్ హైవేలో పెద్ద ఎత్తున స్థల సమీకరణ చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ ` నాగ్పూర్ జాతీయ రహదారి`44 ఈ ప్రాంతాల మీదుగా వెళుతుంది. ముంబై, నాందేడ్, షిర్డీ వైపు వెళ్లే రైలు మార్గం ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణిస్తాయి. బొల్లారం, మేడ్చల్కు ఎంఎంటీఎస్ సదుపాయం కూడా ఉంది.
మరోవైపు సుచిత్ర నుంచి డెయిర్ ఫాం జంక్షన్, సినీ ప్లానెట్ నుంచి జీడిమెట్ల జంక్షన్, కొంపల్లి నుంచి దూలపల్లి కూడలి వరకు మొత్తం 10 కి.మీ. మేర మూడు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించా లని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. జీనోమ్వ్యాలీ, నల్సార్తో సహా ఇతర అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు ఈ ప్రాంతంలో కొలువు దీరాయి. నగరంలోని ఇతర జాతీయ రహదారులతో పోలిస్తే మేడ్చల్ హైవేలో రద్దీ తక్కువగా ఉంటుంది. ఇక్కడ అపార్ట్మెంట్లలో చ.అ. ధర రూ.4,500-5,000, గేటెడ్ కమ్యూనిటీలో అయితే రూ.5,500 నుంచి రూ.6,000లుగా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లయితే గజం రూ.60 వేల నుంచి రూ.80 వేలుగా చెబుతున్నారు.