బే ఏరియాలో విజయవంతమైన జస్టిస్ ఎన్వి. రమణ పర్యటన

అమెరికాలో వివిధ నగరాల్లో ఆరురోజుల పర్యటనలో భాగంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ శాన్ఫ్రాన్సిస్కోలో పర్యటించినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (40 భారతీయ సంఘాల కూటమి) ఆయన కోసం ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ అధ్యక్షుడు జయరాం కోమటి, ఇతర కార్యవర్గ బృందాలతో పాటు భారత కాన్సల్ జనరల్ నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రసంగిస్తూ, తెలుగు భాష ప్రాధాన్యాన్ని తెలియజేశారు. తెలుగు వారంతా తెలుగులోనే మాట్లాడాలి.. బిడ్డలకు తెలుగు ప్రథమ భాషగా చదువు చెప్పించాలి. ఎదుగుతున్న పిల్లలతో ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి.. తెలుగులో ఉత్తరాలు రాసే సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. తెలుగులో మాట్లాడేందుకు సిగ్గు పడాల్సిన అవసరమే లేదు. శతక సాహిత్య, భాషా చరిత్రను యువతకు చెప్పాలి. పిల్లలు మాట్లాడే తెలుగును హేళన చేయకూడదు. వారిని తెలుగులోనే మాట్లాడే విధంగా ప్రోత్సహించాలి. భాష లేకపోతే మన సంస్కృతి, చరిత్ర లేదు అన్న విషయాన్ని గుర్తించాలి. జాతే అంతరించి పోయే ప్రమాదాన్ని గుర్తించాలి..అంటూ సభికులకు సూచనలు అందించారు. ఇదే సందర్భంలో మహిళా సాధికారత గురించి కూడా మాట్లాడారు. ఐటీ విప్లవం ప్రారంభం కాకమునుపే ఎంతో భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తాను రుజువు చేసుకున్నారన్నారు. భారతీయ అమెరికన్ల సదస్సులో సీజే కొన్ని ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వివిధ పార్టీలు వాటి నడవడి గురించి కూడా వివరిస్తూనే,. వారిని ఉద్దేశించి కొన్ని చురకలు అంటించారు. మనం విసిరేయాల్సింది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించే వ్యక్తులను తప్పితే రాజ్యాంగాన్ని కాదు.ప్రతి అయిదేళ్లకోసారి పాలకుల పనితీరుపై తీర్పు ఇచ్చే అధికారాన్ని ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చింది. భారతీయ పౌరులు ఇప్పటివరకూ తమ బాధ్యతను అద్భుతంగా నిర్వహించారు అంటూ కొనియాడారు. మేం రాజ్యాంగానికే విధేయులం.. రాజ్యాంగాన్ని శిలాశాసనంగా కాకుండా చూడకూడదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలూ మారాలి అని అన్నారాయన. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ సంఘాలు సీజే దంపతులను ఘనంగా సత్కరించాయి. కార్యక్రమంలో భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వీడ్కోలు...
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఆరు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరు రోజుల పర్యటన అనంతరం.. వారికి శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో భారత సంతతి వ్యక్తులు.. ఎన్నారైలు.. భారత దౌత్య కార్యాలయ జనరల్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్.. ఆయన బృందం.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన వీడ్కోలు పలికారు. శాన్ఫ్రాన్సిస్కో నుంచి లండన్ చేరుకునే సీజేఐ దంపతులు.. రెండు రోజులు అక్కడే ఉంటారు. అక్కడ జరిగే సదస్సులో పాల్గొని భారత్కు తిరుగు పయనమవుతారు.