పాపం జగన్... ఇంకా అదే మాయలో ఉన్నట్టున్నారు..!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. టీడీపీ నేతృత్వంలోని కూటమికి ప్రజలు పట్టం కట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో జనం ఆ మూడు పార్టీలను ఆదరించారు. ప్రజాతీర్పును శిరసావహించాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వాస్తవాలను జీర్ణంచుకోకపోగా ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారు అన్నట్టు ఆరోపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకోకుండా ఇతరులపైకి నెపం నెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 సీట్లను కైవసం చేసుకుంది. ఉమ్మడి ఏపీలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆ స్థాయిలో ఒక పార్టీకి సీట్లు రావడం అదే తొలిసారి. దీంతో వైసీపీకి తిరుగు ఉండదని అందరూ అనుకున్నారు. కానీ ఐదేళ్లు తిరిగే సరికే ఆ పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కాగా ఎన్డీయే కూటమికి 164 సీట్లు దక్కాయి. ఈ స్థాయి ఓటమిని సహజంగా ఎవరైనా జీర్ణించుకోవడం కష్టం. ఓటమిని అంగీకరించడానికి కొంత సమయం పట్టడం ఖాయం. అయితే నెల దాటిన తర్వాత కూడా వైసీపీ మాత్రం కోలుకున్నట్టు కనిపించట్లేదు.
ఎన్నికల ఫలితాలు రాగానే కొంతకాలం తాడేపల్లిలో ఉన్న జగన్ తర్వాత పులివెందులకు, అటు నుంచి బెంగళూరుకు వెళ్లారు. రెండ్రోజలు కిందట తాడేపల్లి తిరిగివచ్చారు. వెంటనే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ చేసిన కొన్ని కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగించాయి. టీడీపీతో పోల్చితే తామేం తక్కువ కాదని.. మాకు ఇప్పటికీ 40 శాతం ఓట్ బ్యాంక్ ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ప్రజలు తమపై వ్యతిరేకతతో టీడీపీని గెలిపించలేదని.. వాళ్లు స్కీములకు కొంతమంది ప్రభావితమై 10శాతం మంది అటు ఓటేయడం వల్లే కూటమి గెలిచిందని వివరించారు.
అంతేకాదు.. ఈవీఎంలు పగలగొడుతూ అడ్డంగా వీడియోలకు చిక్కిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా జగన్ వెనకేసుకొచ్చారు. ఆయన తప్పేమీ లేదని.. అక్కడ పరిస్థితి బాగాలేనందునే పిన్నెల్లి అలా చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. జగన్ మాటలు విన్న కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. అసలు జగన్ ఏం మాట్లాడుతున్నారో.. అలా మాట్లాడమని ఎవరు సలహా ఇస్తున్నారో అర్థం కావట్లేదని.. ఇప్పటికైనా జగన్ మంచి సలహాదారులను పెట్టుకోవాలని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. వాస్తవాలను జగన్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ఓటమిపై సమీక్ష చేసుకుంటే బెటర్ అని సలహాలిస్తున్నారు.