అమెరికాలో భారత విద్యార్థి బహిష్కరణ.. ఎందుకో తెలుసా?
తప్పుడు పత్రాలతో అమెరికాలో అడ్మిషన్ పొందిన ఓ భారతీయ విద్యార్థి నాటకం బయటపడింది. స్కాలర్షిప్ కోసం ఏకంగా తన తండ్రి చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించడం గమనార్హం. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి అధికారులు అతడిపై బహిష్కరణ వేటు వేశారు. త్వరలోనే స్వదేశానికి పంపించనున్నారు. భారత్కు చెందిన ఆర్యన్ ఆనంద్ 2023 ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ లేహీలో అడ్మిషన్ పొందాడు. ఈ క్రమంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించాడు. పదో తరగతి పరీక్ష ఫలితాలనూ ఫోర్జరీ చేసిన అతడు, పూర్తి స్కాలర్షిప్ కోసం అక్రమ మార్గాలను ఆశ్రయించాడు. తండ్రి బతికే ఉన్నప్పటికీ ఆయన చనిపోయినట్లు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించాడు. ఇలా ఏడాది గడిచింది.
పదో తరగతి బోర్డు ఫలితాలను తారుమారు చేసిన తీరు, తప్పుడు ధ్రువపత్రాలతో అమెరికా కాలేజీలో చేరిన తీరును పేర్కొన్నాడు. అనంతరం చదువుపై ఆసక్తి కోల్పోవడం, స్కాలర్షిప్ కోసం పరీక్షల్లో మోసాలకు పాల్పడటం, తప్పుడు ఇంటర్న్షిప్ల గురించి వివరించాడు. ఈ విషయం అక్కడి అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జూన్ 12న ఆనంద్ను అరెస్టు చేశారు. ఈ కేసులో దాదాపు 20 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది. అయితే, యూనివర్సిటీ అధికారుల అభ్యర్థన మేరకు అతడిపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో త్వరలోనే అతడు భారత్కు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.