సిలికాన్ వ్యాలీలో ఇండియ్ ఇంజినీర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రారంభం
జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనడానికి ఇంజినీరింగును శక్తిమంతమైన సాధనంగా ఉపయోగంచుకొనే లక్ష్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో భారతీయ నిపుణులతో ఇండియన్ ఇంజినీర్స్ వితౌట్ బోర్డర్స్ కార్యవర్గం ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ఇంజినీర్ల ఆలోచనలను ఏకం చేసి, శాశ్వత ప్రభావం చూపే ఆవిష్కరణలతో సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ఉద్దేశమని నెట్వర్క్ సహ వ్యవస్థాపకుడు శచీంద్రనాథ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు ఖండాల్లోని 1,100 మంది సభ్యులతో ఈ వ్యవస్థ ఒక ముఖ్యమైన ప్రయాణానికి నాంది పలికిందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీపీఏఐ సమ్మిట్ 2023లో ప్రధాని మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యారంగాలను మెరుగుపరిచేలా, ఏఐ విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సందర్భంగా 101 డేస్ ఏఐ లెర్నింగ్ ఫెస్టివల్ను నిర్వహకులు ప్రారంబించారు. దీని ద్వారా కొత్తగా చేరినవారికి, ఇతర నిపుణులకు ఏఐ, మెషిన్ లర్నింగులపై నైపుణ్య శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సలహాదారు శైలేంద్ర జోషీ కీలకోపన్యాసం చేశారు.