నా ఫోన్ కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారు : తమిళిసై సౌందరరాజన్
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తన ఫోన్ కూడా హ్యాక్ అయిందంటూ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై అప్పట్లోనే తాను స్పందిస్తే ఎవ్వరూ పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు అదే నిజం అవుతోందని బుధవారం ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు. కాగా.. ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వేడి మీదున్న విషయం తెలిసిందే. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు.. అందరూ తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టీం.. ఇప్పటికే కొంతమంది పోలీసులను కూడా అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. విదేశాల్లో ఉన్న మరికొందరిని భారత్కు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇలాంటి సమయంలో తెలంగాణ మాజీ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘తెలంగాణ గవర్నర్గా పనిచేసే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నా ఫోన్ కూడా ట్యాప్ చేసింది. 2022 లోనే ఈ విషయంపై నేను మాట్లాడితే.. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నాపై ఎదురుదాడికి దిగింది. రాజకీయాలు చేస్తున్నానని నా ఆరోపణలను తోసిపుచ్చింది. కానీ అప్పుడు నేను చెప్పిందే ఇప్పుడు నిజమవుతోంది’’ అని తమిళిసై పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమిళిసై సౌందరరాజన్.. తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని సౌత్ చెన్నై నియోజకవర్గం నుంచి బీజేపీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.