రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా : వైఎస్ జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని దీన్ని తాను గట్టిగా నమ్ముతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 52.31 లక్షల మంది రైతు ఖాతాల్లో మొదటి విడతగా రూ.3,923.21 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల చేస్తున్నామన్నారు. పెట్టుబడి రాయితీ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. వ్యవసాయ రంగంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్నామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా ఏ సీజన్ ఇన్పుట్ సబ్సిడీని ఆ సీజన్లో చెల్లిస్తున్నామన్నారు.
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై జగన్ విమర్శలు చేశారు. ఆ మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలతో పాటు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో టీడీపీ మేనిఫెస్టో ప్రకటించారన్నారు. 2014 ఎన్నికల్లో హామీలను నెరవేర్చకుండా రైతులు, ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.






