ఏపీ అంటే అమరావతి.. పోలవరం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారు. ఈ సంఖ్య కలిపితే వైసీపీకి వచ్చిన సీట్లకు సరిపోలుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో పోరాటాన్ని విరమించారు. రైతులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఎవరూ పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టాం. పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చాం.
పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. అందుకోసం విభజన చట్టం తోడ్పాటు తీసుకున్నాం. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదావరిలో కలిపేసింది. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారింది. ఇటీవల ఎన్నికల్లో కూటమికి చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విజయం ప్రజలు కట్టబెట్టారు. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గత అయిదేళ్లు ప్రత్యక్షంగా చూశాం. అమరావతి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. కేంద్ర నిథులతో పోలవరం కట్టి, ఇక్కడి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే సాగునీటి రంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.