ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏపీ సర్కార్ పై చిరంజీవి డైరెక్ట్ ఎటాక్..!!

ఏపీ సర్కార్ పై చిరంజీవి డైరెక్ట్ ఎటాక్..!!

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. అధికారంలో ఉన్న వైసీపీని ఎలాగైనా ఓడించాలనే పట్టుదల టీడీపీ కంటే ఎక్కువగా జనసేనలో కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ పదే పదే ఈ విషయాన్ని చెప్తున్నారు. జగన్ ను గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమని.. అందుకోసం ఎవరితో అయినా కలిసి పని చేసేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. కాబట్టి ఈ విషయంలో ఆయనకు ఓ క్లారిటీ ఉంది. అయితే పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి.. వైసీపీ అధినేత జగన్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. చిరంజీవి కూడా పవన్ కు మద్దతు ఇస్తే బాగుంటుందని జనసైనికులు ఆశిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టు కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు వీరయ్య 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవలికాలంలో అందరూ సినీ ఇండస్ట్రీపై పడి అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. ‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ – ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదల కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేకానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి’ అని చిరంజీవి డైరెక్ట్ ఎటాక్ చేశారు.

ఇటీవలికాలంలో మంత్రి అంబటి రాంబాబు సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి కొన్ని హెచ్చరికలు చేశారు. బ్రో సినిమాలో ఆయన్ను కించపరిచేలా సన్నివేశాలు చిత్రీకరించారని.. ఇకపై అలా చిత్రీకరించే దర్శక రచయితలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశారు. సినీ ఇండస్ట్రీని జగన్ తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఏపీలో సినిమాలు ఆడనివ్వకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై నోరు మెదిపేందుకు ఎవరూ సాహసం చేయలేదు. పైగా జగన్ ను ప్రసన్నం చేసుకుని సమస్యను పరిష్కరించుకునేందుకు చిరంజీవి ఇండస్ట్రీ ప్రముఖులందరినీ తాడేపల్లి తీసుకెళ్లి కలిశారు. అక్కడ జగన్ ముందు చిరంజీవి చేతులు కట్టుకుని మాట్లాడిన మాటలను సీఎంఓ ఆ తర్వాత బయటకు విడుదల చేసింది. ఇది అవమానంగా భావించారు చిరంజీవి.. మెగాస్టార్ ఫ్యామిలీ.. అభిమానులు.

చిరంజీవి లాంటి వ్యక్తి జగన్ ముందు అలా సాగిలపడడాన్ని ఇండస్ట్రీలో చాలా మంది వ్యతిరేకించారు. అయినా చిరంజీవి ఎప్పుడూ నోరు మెదలపేదు. పవన్ కల్యాణ్ కూడా తన సోదరుడికి జరిగిన అవమానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి అలా వెళ్లడాన్ని తప్పుబట్టారు. కానీ ఇప్పుడు చిరంజీవికి అర్థమైనట్టుంది. అందుకే నేరుగా కామెంట్స్ చేశారు. తమపై పడి ఏడవద్దని సూచించారు. చిరంజీవి కామెంట్స్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం రేకెత్తించాయి. ఇన్నాళ్లూ జగన్ తో స్నేహంగా ఉన్న చిరంజీవి ఇకపై అలా ఉండబోరని.. పవన్ కు మద్దతిస్తారని చెప్పుకుంటున్నారు జనసైనికులు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :