ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల : చంద్రబాబు
భావితరాల భవిష్యత్ను గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చాం. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయి. బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం ఎంత నష్టంలో చేసిందో ప్రజలకు చెబుతున్నాం. విద్యుత్తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
విద్యుత్ సంస్కరణల వల్ల నా అధికారం పోయినా దేశం బాగుపడింది. నేను తెచ్చిన సంస్కరణలు వైఎస్ హయాంలో కనిపించాయి. మా హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నాం. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచాం. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగింది. 2018-19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేశాం. మా హయంలో ట్రాన్స్కో, జెన్కోకు అవార్డులు వచ్చాయి. గత ఐదేళ్లలో ప్రజలపై రూ.32,166 కోట్ల ఛార్జీల భారం మోపారు. విద్యుత్ రంగంలో రూ.49,596 కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు.