పాలనలో నాటి వేగం చూపిస్తారా..?
ఏపీ సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో అధికారులు ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సైన్సెస్పై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
పాలనా పగ్గాలు చేపట్టకముందే చంద్రబాబు పని ప్రారంభించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని రప్పించుకుంటున్నారు. ఎక్కడా ఏ ఫైల్ కార్యాలయం దాటకుండా ఇప్పటికే తగిన జాగ్రత్తలు సైతం తీసుకున్నారు.మరి ఇప్పుడు ఆ ఫైల్స్ ను శరవేగంగా కదిలేలా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఎందుకంటే చాలా కీలకమైన అంశాలు ..మరీ ముఖ్యంగా కూటమి మేనిఫెస్టోలోని అంశాల అమలుకు చంద్రబాబు అధిక ప్రాధాన్యమివ్వాల్సి ఉంది.
1995లో తొలిసారి సీఎంగాప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు ...పాలనలో తనదైన మార్కు చూపించారు. మిగిలిన రాష్ట్రాలకు, నేతలకు.. పాలన అంటే ఇది, సంస్కరణల పథం అంటే ఇలా ఉంటుందని చూపించారు. దీంతో ఏపథకమైన అమలు చేయాలంటే.. వారంతా ఏపీకి వచ్చి పరిశీలించి.. తమ రాష్ట్రాల్లో అమలు చేసేవారు. అంతెందుకు గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోడీ సైతం..చంద్రబాబు పంధాను అనుసరించారని సమాచారం.
మరి ఇప్పుడు ఆ వేగాన్ని ప్రదర్శిస్తారా..? ఆర్థిక సుడిగుండంలో పడి విలవిలలాడుతున్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారా..? రాష్ట్రాన్ని ఒడ్డున పడేసేందుకు చంద్రబాబు ఎలాంటి పంథా అవలంభిస్తారు.? సంక్షేమపథకాలకు కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. వాటినెలా కొనసాగిస్తారు.? అభివృద్ధి పథకాలను ఎలా అమలు చేస్తారు. వీటన్నింటికీ నిధులెలా తెస్తారు. కేంద్రంలో కూడా కూటమి సర్కార్ ఉంది కాబట్టి... అక్కడి నుంచి తెచ్చేవీలు కలుగుతుందా..? ఇప్పుడీ ప్రశ్నలు ఆంధ్రప్రజల్ని వేధిస్తున్నాయి. అయితే చంద్రబాబు సమర్థతపై ఆశలుండడంతో.. ప్రజలు మరోసారి రాష్ట్ర పునర్ వైభవాన్ని చూడాలనుకుంటున్నారు.