కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే : చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ తెచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని జగన్ రూ.13 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చి, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు తెచ్చారా? అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలకు ప్రాధాన్యమిస్తామని, గ్రామాల్లో సర్పంచ్లకే అధికారం ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని, కేంద్రం సహకారం కూడా రాష్ట్రానికి అవసరమన్నారు.
వైసీపీ పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా. విద్యపై పెట్టిన ఖర్చు ఎంత? వచ్చిన ఫలితాలేంటి? వైసీపీ నేతలు దోచింది ఎంత? దాచుకున్నది ఎంత? రాష్ట్రంలోనే అత్యంత ధనికుడు జగన్. ఇష్టానుసారం భూములు దోచుకున్నారు. జగన్ చేసే పనులకు చెప్పే మాటలకు పొంతన ఉందా? రాయలసీమను ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ఆరోగ్యాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది అని మండిపడ్డారు.