మసీదు ఎదుట బాణం విసిరిన మాధవీలత.. ఓవైసీ ఫైర్
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి మాధవీలతపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మాధవీలత ఓ మసీదు ముందు నిలబడి బాణం వేస్తున్నట్లు పోజివ్వడంపై ఓవైసీ ఫైరయ్యారు. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఓవైసీ.. భవిష్యత్తులో తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నారంటూ బీజేపీని, ఆ పార్టీ అభ్యర్థి మాధవీలతను ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉంటుందని, అసలు ఈ చర్యలతో ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
‘‘నరేంద్ర మోదీ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటే ఇదేనా? బీజేపీ పదే పదే చెప్పే వికసిత్ భారత్ అంటే ఇదేనా? మాకు ఎన్నికల కంటే హైదరాబాద్ శాంతి ముఖ్యం. తెలంగాణ శాంతికి ప్రతికూలంగా వ్యవహరించే బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఓటు వేస్తారని నమ్ముతున్నాను’’ అంటూ బీజేపీపై ఓవైసీ విమర్శల వర్షం కురిపించారు. అలాగే హైదరాబాద్ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, వారి కళ్లు మూయించడం ఎవ్వరికీ సాధ్యం కాదని, బీజేపీ-ఆర్ఎస్ఎస్ల రెచ్చగొట్టే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ వారు సహించబోరని వ్యాఖ్యానించారు. కాగా, శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ర్యాలీ నిర్వహించిన బీజేపీ అభ్యర్థి మాధవీలత.. మసీదు వద్దకు రాగానే బాణం తీసి వేస్తున్నట్లుగా పోజిచ్చారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది.