కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్
కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా మోదీ ప్రభుత్వంలో అవకాశం దక్కింది. ఈ మేరకు తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా విజయం సాధించిన కిషన్ రెడ్డి, ప్రధాని మోదీ క్యాబినెట్లో మరోసారి అవకాశం దక్కించుకున్నారు. ఆయనకు బొగ్గు, గనులశాఖ బాధ్యతలను ప్రధాని అప్పగించారు. ఈ నేపథ్యంలో తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, బాధ్యతలు చేపట్టారు.
అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతాం. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తాం. బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖల అధికారులు ఒక బృందంగా నిబద్ధతతో పనిచేస్తాం అని తెలిపారు.