కోడికత్తి తరహాలో ఎంపీ అవినాష్ రెడ్డి డ్రామా

కోడికత్తి తరహాలో ఎంపీ అవినాష్ రెడ్డి డ్రామా కొనసాగుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లలో సీఎం జగన్ నమ్మకద్రోహంతో నయవంచక పాలన అందించారని విమర్శించారు. రాజధాని అంశంతో పాటు రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధర, బిందు సేద్యం తదితర అంశాల్లో సీఎం మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి దారిదోపిడీకి మించిపోయిందన్నారు. పంచభూతాల్లో ఏ ఒక్కదాన్నీ వదలకుండా వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు అనివాష్ రెడ్డి సహకరించడం లేదు. సీబీఐకి రాష్ట్ర పోలీసులు సహకరించకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. అవినాష్ అరెస్ట్ ఖాయం. వైసీపీలో సంస్కారం లేని వ్యక్తులు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. యువతకు మెగా డీఎస్సీ అని జగన్ నమ్మకద్రోహం చేశారు. రాష్ట్రంలో రీసర్వే పేరుతో అటవీ, వివాదాస్పద, ప్రభుత్వ భూములను గుర్తించి ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. నెల్లూరులో ఓబీసీ మోర్చా నాయకుడిపై పోలీసులు వ్యవహరించిన తీరు హేయమైనది అని అన్నారు.






