నమూనాలిస్తే అంతా నిరూపిస్తా... బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ టిల్లు, డ్రగ్స్ బానిస అంటూ విరుచుకుపడ్డారు. నమూనాలిస్తే అంతా నిరూపిస్తానని, రక్త, వెంట్రుక నమూనాలిచ్చే దుమ్ముందా? అంటూ సవాల్ విసిరారు. నేను తంబాకు తింటానని పచ్చి అబద్ధాలు చెప్పినవ్ కదా. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్ కేసులను రీ ఓపెన్ చేయించాల్సిందే అని పట్టుబట్టారు. జీ-20 నిర్వహణ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. దేశంలోని అన్ని పార్టీలు, అందరు సీఎంలు వెళ్లినా కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో సమాధానమివ్వాలన్నారు. ఆ సమయంలో బిడ్డను సారా దందా స్కాంలో నుంచి ఎట్లా కాపాడుకోవాలనే దానిపై లాయర్లతో మంతనాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ జయంతి, వర్థంతిలకు హాజరు కాని మూర్ఖుడు కేసీఆర్ అని వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో శక్తివంతమైన దేశంగా మార్చుతున్న గొప్ప నాయకుడు మోదీ అని కొనియాడారు.