ఓటమి నుంచి కోలుకోలేకపోతున్న జగన్..!
![ఓటమి నుంచి కోలుకోలేకపోతున్న జగన్..!](https://www.telugutimes.net/storage/news/news_new_74328.jpg)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించడంతో ఇంతకు మించి ఎవరూ సీట్లు భవిష్యత్తులో సాధించలేరని అందరూ అనుకున్నారు. వైసీపీ రికార్డును బద్దలు కొట్టడం ఎవరివల్లా కాదనుకున్నారు. అయితే తాజా ఎన్నికల్లో కూటమి ఈ సీట్లను అధిగమించి కనివినీ ఎరుగని విజయాన్ని నమోదు చేసింది. వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఈ ఫలితాల సరళి అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
గత ఐదేళ్లలో గతంలో ఎన్నడూ లేన విధంగా, ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని వైసీపీ చెప్పుకుంటోంది. ఐదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసింది. ప్రతి ఇంటికీ మంచి చేశామని.. మీకు మంచి జరిగి ఉంటేనే తమకు ఓటేసి ఆశీర్వదించాలని జగన్ సూచించారు. అంత ధీమాగా ఉండేవారు వైసీపీ నాయకులు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే రావడంతో తమ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఏమైపోయాయ్ అని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. లబ్దిదారులంతా ఏమైపోయారని ప్రశ్నించుకుంటున్నారు.
వైసీపీ ఓటమికి కారణాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. కక్షసాధింపు ధోరణి, విపక్ష నేతల కుటుంబాలను అవమానించడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లిక్కర్, అమరావతిని ధ్వంసం చేయడం.. లాంటి ఎన్నో కారణాలు వైసీపీకి కారణాలుగా అంచనా వేస్తున్నారు. అయితే తాము మరీ అంత అధ్వాన్నంగా ప్రవర్తించామా అని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. కేవలం 11 సీట్లకు పరిమితం చేసేంత తప్పు తామేం చేశామని ప్రశ్నిస్తున్నారు. జగన్ కోటరీనే ఓటమికి కారణమని కొందరు చెప్తుంటే.. జగన్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడిపోయామని మరికొందరు విమర్శిస్తున్నారు.
ఎన్నికల ఫలితాల నుంచి వైసీపీ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేకపోతోంది. ఫలితాల రోజు జగన్ బయటికొచ్చి ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామన్నారు. ఆ తర్వాత బయటకు రాలేదు. ఆ పార్టీ నేతలు కూడా ఫలితాలపై మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని చెప్పేందుకు వస్తున్నారు తప్పా ఓటమిని మాత్రం వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నట్టు అర్థమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు చేసిన కామెంట్స్, తిట్లు అన్నింటినీ ఇప్పుడు కూటమి నేతలు రివైండ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు మరింత కుమిలిపోతున్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)