కాలిఫోర్నియాలో ఎఐఎ హోళీ వేడుకలు జయప్రదం
శాన్హోసెలో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ), బాలీ 92.3 ఆధ్వర్యంలో జరిగిన హోళీ వేడుకలు విజయవంతమైంది. దాదాపు 45 సంస్థల సమూహమైన ఎఐఎ నిర్వహించే కార్యక్రమాలకు ఇండియన్ కమ్యూనిటీకి చెందినవారు పెద్దసంఖ్యలో హాజరవుతుంటారు. అలాగే ఈ హోళీ వేడుకకు కూడా దాదాపు 10,000 మందికిపైగా కమ్యూనిటీకి చెందినవారు హాజరయ్యారు. కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు సాగింది. ఈ వేడుకలకు సంజీవ్ గుప్తా సిపిఎ గ్రాండ్ స్పాన్సర్, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య, ట్రావెల్ పార్టనర్ ట్రావెలోపాడ్, మంత్ర ఇండియా, చాట్ భవన్ (ఫుడ్ స్పాన్సర్లు) మెయిన్ స్పాన్సర్లుగా వ్యవహరించారు. వీరితోపాటు ఆన్షోర్ కరే, ఐసీఐసీఐ బ్యాంక్, జ్యోతిష్యుడు విష్ణు, ఎన్బిసి బేఏరియా కూడా స్పాన్సర్లుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి చీఫ్ ఆంథోనీ మాతా (శాన్హోసె పోలీస్ డిపార్ట్మెంట్), లారీ క్లైన్ (మేయర్, సన్నీవేల్), మురళీ శ్రీనివాస్ (వైస్ మేయర్, సన్నీవేల్) లిల్లీ మెయి (ఫ్రీమాంట్ మేయర్), రాజ్ సాల్వాన్ (వైస్ మేయర్, ఫ్రీమాంట్) సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఓ ఆఫీస్ నుంచి హరీష్ ఖర్బండా, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కార్యాలయం నుండి టామ్ పైక్, శాన్ హోసె కౌన్సిల్ సభ్యులు డొమింగో కాండెలాస్, అర్జున్ బాత్రా మరియు డోన్ బీన్. తారా శ్రీకృష్ణన్ (ఎస్సీ ఎడ్యుకేషన్ బోర్డు), సెనేటర్ డేవ్ కోర్టేస్, అసెంబ్లీ సభ్యుడు యాష్ కల్రా, అసెంబ్లీ సభ్యుడు అలెక్స్ లీ కార్యాలయాల నుండి వారి ప్రతినిధులు తదితరులు హాజరై వచ్చినవారందరికీ ‘‘హోళీ’’ శుభాకాంక్షలు తెలియజేసారు.
భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఎఐఎ చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు. ఇంత పెద్దఎత్తున వేడుకలను నిర్వహించడం చూసి ఎంతోమంది తాము భారతదేశంలో ఉన్నట్లు అనుభూతి కలుగుతోందని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ వేడుకలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన ఎఐఎను వారు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.