అమెరికా తెలుగు అసోసియేషన్ మహాసభలు 2024
ఆటా మహాసభల కోసం ఇప్పటికే అనేక కమిటీలను ఏర్పాటు చేశారు. అడ్హాక్ కమిటీ, కోర్ కమిటీ, అడ్వయిజరీ కమిటీ, కాన్ఫరెన్స్ కమిటీలలో ఉన్న ప్రముఖులు మహాసభల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను, సూచనలను, సలహాలను అందజేస్తూ మహాసభల విజయవంతానికి కృషి చేస్తున్నారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, మహాసభల కన్వీనర్ కిరణ్ పాశం ఆధ్వర్యంలో వివిధ ప్రణాళికలను, ప్రముఖులను ఆహ్వానించడం వంటివి చేస్తున్నారు. ఈ మహాసభలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానపత్రాలను ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశంతోపాటు పలువురు ఆటా నాయకులు స్వయంగా కలిసి అందజేస్తున్నారు.
వై.ఎస్. జగన్కు ఆహ్వానం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆటా కన్వెన్షన్కు రావాల్సిందిగా ఆటా నాయకులు స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నెల్లూరులో ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, ఆటా మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, కోఆర్డినేటర్ వశిష్టి రెడ్డి కలిశారు. ముందుగా పుష్పగుచ్చం అందించి కుశల ప్రశ్నలు వేశారు. అనంతరం ఆటా 18వ మహాసభల ఆహ్వానాన్ని సాదరంగా అందజేసి తప్పకుండా రావలసిందిగా కోరారు ముఖ్యమంత్రి జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆహ్వానం
అట్లాంటాలో జరిగే 18వ ఆటా కాన్ఫరెన్స్కు ముఖ్య అతిధిగా రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను ఆటా సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆటా కాన్ఫరెన్స్కు హాజరై తమ సందేశాన్ని వినిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ అడ్వజర్ చైర్ గౌతమ్ గోళి, 18వ ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, కల్చరల్ చైర్ నీలిమ గడ్డమనుగు, పొలిటికల్ చైర్ రమణ బత్తుల హాజరయ్యారు. కాగా ఆటా కాన్ఫరెన్స్కు ప్రభుత్వం తరఫున ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పటెల్ రమేష్ రెడ్డిలను పంపిస్తామని ముఖ్య మంత్రి ఈ సందర్భంగా ఆటా నాయకులకు హామి ఇచ్చారు.
బాలకృష్ణను కలిసిన ఆటా నాయకులు
అట్లాంటాలో జూన్ 7,8,9 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాల్సిందిగా టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణను ఆటా నాయకులు ఆహ్వానించారు. నందమూరి బాలకృష్ణను ఆటా నాయకులు స్వయంగా కలిసి మహాసభలకు రావాల్సిందిగా కోరారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, అడ్వ్కెజర్ గౌతం గోలి, డైరెక్టర్ అనీల్ బొద్దిరెడ్డి, ఆటా నాయకులు సన్నీరెడ్డి, కల్చరల్ చైర్ నీలిమ గడ్డమణుగు, కోడైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ మరియు పొలిటికల్ చైర్ రమణ బత్తుల తదితరులు బాలకృష్ణను కలిసిన వారిలో ఉన్నారు.
కిషన్ రెడ్డిని కలిసిన ఆటా నాయకులు
అట్లాంటాలో జూన్ 7,8,9 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాల్సిందిగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిని ఆటా నాయకులు ఆహ్వానించారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆటా బృందం కిషన్ రెడ్డిని కలిసి ఆటా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆటా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, డైరెక్టర్ అనీల్ బొద్దిరెడ్డి తదితరులు కిషన్ రెడ్డిని కలిసినవారిలో ఉన్నారు.
సింగర్ మంగ్లీ
సినిమా పాటలు, ఆల్బమ్ సాంగ్స్తో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ అమెరికాలో కూడా తన పాటలతో ఎన్నారై అభిమానులను సంపాదించుకున్నారు. మహాసభలకు రావాల్సిందిగా సింగర్ మంగ్లీని ఆటా నాయకులు కలిసి ఆహ్వానించారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి తదితరులు సింగర్ మంగ్లీని కలిసినవారిలో ఉన్నారు.
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్లతో..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్లను ఆటా మహాసభలకు రావాల్సిందిగా ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని, 18వ ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, డైరెక్టర్ అనీల్ బొద్దిరెడ్డి తదితరులు ఆహ్వానించారు. విజయ్ దేవరకొండ కూడా ఆటాతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ధ్యానగురువు దాజీతో సమావేశం
అట్లాంటాలో జూన్ 7,8,9 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంఘం మహాసభ లకు రావాల్సిందిగా ప్రముఖ ధ్యానగురువు, దాజీగా పిలిచే కమలేశ్ డి. పటేల్ను ఆటా నాయకులు ఆహ్వానించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, డైరెక్టర్ అనీల్ బొద్దిరెడ్డి తదితరులు ఆయనను కలిసి ఆటా మహాసభలకు రావాలని కోరారు. ఈ సందర్భం గా ఆయనతో కలిసి డిన్నర్ కూడా చేశారు. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఏకాగ్రతను పెంపొం దించుకోవచ్చని చెప్పే దాజీ హైదరాబాద్కు సమీపంలో నందిగామ మండలంలో సుమారు 1,400 ఎకరాల్లో కన్హా శాంతివనం పేరుతో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్గా పేరుపొందిన ఈ ప్రాంతంలో ఒకేసారి లక్ష మంది కూర్చుని ఏకాంతంగా ధ్యానం చేసే అవకాశం ఉంది. ఇక్కడ 160 దేశాలకు చెందిన సుమారు ఐదువేల మంది అభ్యాసికులు ఉన్నారు. ధ్యాన గురువుగా చేస్తున్న సేవలకు ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న ఆయన్ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. శ్రీరామచంద్రమిషన్, హార్ట్ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్, హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టులను కూడా ఆయన ఏర్పాటు చేశారు.
ఫ్యామిలీస్టార్ సినిమా ఫంక్షన్లో ఆటా నాయకుల సందడి
పరశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ప్రముఖ నటులు అజయ్ ఘోష్ తదితరులు నటించిన ది ఫ్యామిలీ స్టార్ తెలుగు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో ఆటా నాయకులు పాల్గొని సినిమా యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ యాంకర్ సుమ ఆటా నాయకత్వాన్ని వేదిక మీదకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని, 18వ ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, డైరెక్టర్ అనీల్ బొద్దిరెడ్డి మాట్లాడుతూ ఆటా సేవాకార్యక్రమాలను వివరించి, ఆటా కన్వెన్షన్ లో పాల్గొనవలసిందిగా సభాముఖంగా కోరారు. అలాగే ది ఫ్యామిలీ స్టార్ యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కల్చరల్ ఛైర్ నీలిమ గడ్డమనుగు, కోడైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ మరియు పొలిటికల్ ఛైర్ రమణ బత్తుల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ది ఫ్యామిలీ స్టార్ సినిమా టీంతో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా కనిపించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్కి ఆటా అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించింది.
మహాసభలకు అందాల ముద్దుగుమ్మ జాహ్నవి రాక
నాటి సినీ అందాల నటి శ్రీదేవి కూతురుగా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన జాన్వీకపూర్ తన సినిమాలతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్లో అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపును పొందిన జాన్వీకపూర్ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రామ్ చరణ్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీదేవిలాగానే తన అందచందాలతో ఆకట్టుకునేలా ఉన్న జాన్వీకపూర్ ఆటా మహాసభలకు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆటా నాయకులు జానీకపూర్ను, ఆమె తండ్రి బోనీ కపూర్ను స్వయంగా కలుసుకుని ఆహ్వానించారు. బోనీ కపూర్ కూడా ఆటా కాన్ఫరెన్స్కు వస్తున్నట్లు హామి ఇచ్చినట్లు వార్త. ఆటా నాయకులు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు.