కాంగ్రెస్ తరపున ఇదే మా డిమాండ్ : వైఎస్ షర్మిల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏలుబడిలో బడుగు బలహీనవర్గాల జీవన ప్రమానలు అధ్వానంగా మారాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ మేరకు జగన్కు ఆమె బహిరంగ లేఖ రాశారు. నిధులు దారి మళ్లించి బడ్జెట్ పరంగా ఉప ప్రణాళికను మంటగలిపారని దుయ్యబట్టారు. మీరు అధికారంలోకి వచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలను నిర్లక్ష్యంగా నిలిపేశారు. దళితులపై దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. దాడులు నివారించి వారిని కాపాడే నిర్దిష్ట చర్యలు లేవు. దాడులు చేసినవారిలో ఎక్కువ మంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లే. ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి. ఇకపై ఏ వివక్షా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి. బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్ తరపున ఇదే మా డిమాండ్ అని అన్నారు.