కూటమి మేనిఫెస్టోలో బీజేపీ కి భాగస్వామ్యం ఉందా లేదా? ..ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
రాజమండ్రిలో సోమవారం నాడు నిర్వహించిన కూటమి సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో ఓ రకమైన కన్ఫ్యూషన్ని తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. విలేకరులతో మాట్లాడుతూ.. అసలు కూటమిపై తనకు అనుమానం కలుగుతుంది అని అన్నారు. టీడీపీ, జనసేనతో కలిసి కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ.. మేనిఫెస్టోలో మాత్రం తనకు భాగస్వామ్యం ఉంది అన్న విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతోంది అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ప్రతిపాదించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ యాక్ట్ కేవలం హక్కుదారులకు మేలు చేయడానికి అని మరొకసారి ప్రస్తావించారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి పేదలకు భూములు ఇచ్చే వ్యక్తి తప్ప వారి దగ్గర నుంచి అక్రమంగా లాక్కునే నాయకుడు కాదు అని స్పష్టం చేశారు. ఇందుకు నిదర్శనం 31 లక్షల మందికి జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాలు అని పేర్కొన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. ఎవరు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా వారు అంత సులభంగా మోసపోరని ఆయన పేర్కొన్నారు.